Title Picture

నిన్నటి తెలుగు మేకు నేటి హిందీ రీమేకు

భారతీయ చలన చిత్ర చరిత్రలో ఇది రీమేకుల యుగం అంటే జోకుకాదు. మన చిత్రసీమ నిజంగానే ఇప్పుడు మూడు మేకులు ఆరు రీమేకులుగా వర్థిల్లుతున్నది. నిన్నటి తెలుగు మేకు నేటి హిందీ రీమేకు. అదే రేపటి కన్నడమేకు. తెలుగులో తీసిన పదేళ్ళకి హిందీలో తీసి, దాన్నే మళ్ళీ పదేళ్ళకి తెలుగులో తీసిన సందర్భాలున్నాయి. వాటిని రీరీమేకులు అనవచ్చు.

Title Picture

బూడిదలో పోసిన పన్నీరు

ఉత్తమాభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న శశికపూర్ కోట్లు ఖర్చు పెట్టి తీసిన చిత్రం ఇది. 'కాడు', 'వంశవృక్ట' వంటి కళాత్మక కన్నడ చిత్రాలకు దర్శకత్వం వహించిన గొప్ప నటుడు గిరీశ్ కర్నాడ్ దీని దర్శకుడు. దేశంలోని అరడజను మంది అత్యుత్తమ నటీమణులలో ఒకతయిన రేఖ ఈ చిత్ర కథానాయికగా నటించింది. శశికపూర్ తన నట జీవితంలో మొదటిసారిగా ఈ చిత్రంలో దుష్టపాత్ర ధరించాడు. తన సినీ జీవితానికి ఈ చిత్ర నిర్మాణం పరాకాష్ఠ అనీ, ఇటువంటి చిత్రం మరొకటి తన జీవిత కాలంలో నిర్మించలేకపోవచ్చుననీ శశికపూర్ ప్రకటించాడు. ఇది అద్భుతమైన చిత్రమని విడుదలకు ఏడాది ముందు నుంచి ప్రచారం జరిగింది. ఈ చిత్రంపై వెలువడిన తొలి సమీక్షలు కూడా దీన్ని కళాఖండంగానే వర్ణించాయి.